"http://www.jalleda.com/images/jalleda3d48x32.png">

29 జులై, 2017

సాయంత్రాలు బిడియం గా
పదహారేళ్ల పడుచు యవ్వనంలా
సందేహ పడుతూ వస్తాయి ..

పరదాల అంచున కొంచం
సరదాలు దాచేసుకుని
చీకటి పడనీ అంటూ మారాము చేస్తూ

అది కొంచం అలకో ,తీవ్రమైన వేదనో
తెలియ చెప్పని కళ్ళ ఎరుపు
చాటున తెల్లని కనుపాప చల్లగా నవ్వుతూ

సన్నజాజులు తెచ్చావా ? మల్లె మొగ్గలు
ముడిచావా ? అని కొంటె మాటలు
బిగించిన ఆ గాలి వెనక వెనక అలఓకగా ..

సముద్రం ఒక్క పరి ఆగి నెమ్మదించి
నలు దిక్కులా చూసి ,రాత్రి ఆకాశంకి
ఎలా స్వాగతాలు పలకాలా అని ఉసురుసురంటూ
ఘోషిస్తూ అలల తో మొర బెట్టుకుంటూ ..

ఆట పాటల సూర్య బింబం ఆఖరి గోల్
కొడుతూ ఆమడ దూరంలో ,ఆ కొండల మధ్యలో
ప్రకృతి అంతా స్త్రీ రూపమే సుమా ? అంటూ
ఉద్విగ్నంగా మైదానం పరుచుకుంది ..

పలచటి ఆ మబ్బు తెర ,ఆ కొండల
శిఖరాల్ని కప్పేస్తూ , ఎందుకో విచ్చలివిడితనం
ఎవరూ ఒప్పరు !!

సాయంత్రాలు మటుకు ఒలికిన
ఆ రెండు అమృత బిందువులు
రుచి చూసి రాత్రి కోసం తహ తహ లాడే
పెదవులు అనిపిస్తాయి ..

ఈ సాయంత్రం కూడా
అదే వేషం ధరించి
ఇలా అరుదెంచింది ..
ఎందుకో అంత తొందర ?
రాత్రి గా మారాలని ఎంత విరహమో !!

ఈ సాయంత్రం ..ఇలాగే ఇలగే
ఎప్పటికీ ఇలాగే ..

వసంత లక్ష్మి
మా ఇల్లు ..వైజాగ్
29 -07 - 2016

9 ఏప్రి, 2017

ఆదివారం ఇలా మొదలయింది ..


నాటకంలో పాత్ర
కప్పులోంచి కాఫీ తాగుతున్నట్టు
ఖాళీ కప్పు అని మనకీ తెలుసు 
మనకి తెలుసని వాళ్ళకీ తెలుసు
జీవితంలో సంతోషం , వెలుగూ
చాలా ఎక్కువ ఉన్నట్టు మనమూ
సహజంగా నటిస్తూ ఉంటాం ,
నటిస్తున్నట్టే తెలియదు మనకి
అదీ విషాదం ...
నది మలుపు మలుపు లో
ఆగి అడగదు , తిరగనా ? ఇటు అని
జీవితం మటుకూ ?
నీకు అవకాశం ఇస్తుందా ?
నీ అనుమతి అడిగి , అలా ప్రవహిస్తూ
ఉండడమే జీవితం .
సముద్రంలో అలలు
ఆశల కిరణాలని మెరుస్తూ
మోసుకు వెళుతున్నాయి ,
తీరా తీరం చేరే సరికి , కిరణం
ఎక్కడో జార్చేసుకున్నాం అని తెలిసి
వెనక్కి తిరిగాయి , మనం ఏమైనా
నేర్చుకున్నామా ?
వాన పడ్డాక మట్టి
బురదగా మారి రొచ్చు రొచ్చు
అనిపిస్తుంది ,
అనుభవాలూ అంతే ..
నీట్ అండ్ క్లీన్‌ గా
జీవితం ఎప్పుడూ డ్రై గా
ఉండాలి అంటే ఎలా ?
కొంచం బురద అంటనీయండి
కాళ్ళకీ , మనసుకీ !!
వసంత లక్ష్మి

4 ఏప్రి, 2017

ఈ పాట .. నా నోట ..


పాట ఒక హృదయాన్ని
మీటే వరకూ ఉత్త లల్లాయి పదమే
పాట ఎన్ని ఊళ్ళు దాటినా 
అలసిపోదు ఎందుకో !!
కోయిల కంఠంకి ఎవరు తేనె అద్దారు ?
హంస కి ఠీవి, నెమలి కి నాట్యం
నేర్పినవారు , నా కేమి నేర్పించారో
అని రోజూ వెతుకులాటే !!
సంగీతం అంటే నాకు
పగళ్ళు రాత్రుళ్ళు గా మారడమే
ఆకాశం నలుపు రంగు పూసుకునే
ప్రతీ నిముషమూ ఓ స్వర రాగమే !!
వెన్నెల కురిపించే ప్రతీ రాత్రీ
జుగల్బందీ నా కళ్ళ ముందు !!
నీ చుట్టూ చేరి మోగే
అనవసర మోతలు ఒక్కసారి కట్టేయ్
నిశ్శబ్దంలో అలా తపస్సు చేస్తే
నీకు నీ పాట వినిపిస్తుంది .
సంగీతానికీ ,శబ్దానికీ
మృత్యువు లేదు ,కొండలు పాడే
మౌన రాగం ఎన్ని శతాబ్దాలు అయినా
ఒకటే తాళం వేస్తూ నిలబడి ఉంటుంది .
ఆకులు పాడే రాగ మధురిమలు
అమ్మ చెట్టుకి ఎంత ఇష్టమో
కదలక ,మెదలక ,స్థాణువుగా
వింటూ పూలను రాలుస్తూ ఉంటుంది ...
వసంత లక్ష్మి

26 మార్చి, 2017

అడగందే అమ్మయినా పెట్టదు .

అమ్మా ! అంటూ తనయ్ పరుగులు పెట్టుకుంటూ వచ్చి ఒళ్ళో వాలి పోయాడు , అబ్బా ! అలా మీద పడిపోకురా బాబూ' ఎంత పెద్ద వాడైపోతున్నాడు  అంటూ ముద్దుగా విసుక్కుంటూ లేచాను . 
వాడి కేదోటి చేసి పెట్టాలి సాయంత్రం ఉపహారం ఇప్పుడు . ఈయన మటుకు ఈయన చేతులూపుకుంటూ ఉదయమూ సాయంత్రమూ నడక అంటూ ఇంట్లోంచి పారిపోతారు , తనకి తప్పదు కదా ! చంటివాడు ఎదుగుతున్న పిల్లాడు ,ఇంకా నాలుగో  తరగతి ఇప్పుడు , ఎప్పటికి తేరేను ? తీరేను ? నా బాధ్యతలు అంటూ మొకాలు మీద చేయాంచి   లేస్తూ , ఈ  నరసమ్మ   ఇవాళ కూడా వనిలోకి రాలేదు , తన కష్టాలు తనవి . మొగుడు తాగి వచ్చి కొట్టాడు అంటూ చూపిస్తుంది. నువ్వూ తిరిగి కొట్టు ,ఓ కర్ర పుచ్చుకుని అంటే " అమ్మో ! చంపేస్తాడు " అంటుంది . నాలుగిళ్ళల్లో పని చేస్తూ పోషిస్తున్నది తనే , ఓపిక ఉంటే ,తాగని రోజు పనిలోకి వెళతాడుట లేక పోతే ఇంట్లోనే తాగి పడుకుంటాడుట , తాగి వచ్చి పడుకున్నా ఫరవాలేదు ,ఏదో ఒంక పెట్టి నా వీపు మీద గుద్ది ,చెయ్యి మెలి పెట్టి తన్నకుంటే చాలు అని దణ్ణం పెట్టుకుంటుంది ...ఆడవాళ్ళు అంద రూ ఇంతేనా ? కష్టాలలోనే సుఖాలు వెదుక్కుంటూ ఉంటామా ? 

ఇడ్లీ పిండి తో ఓ ఊతప్పం చేసి పెడితే ఆవురావురమని తిన్నాడు , అదొద్దు ,ఇదొద్దు అంటూ ఒక్క నాడూ వంకలు పెట్టడు ,  అమ్మా ,అమ్ముమ్మా అంటూ ఎలా తోస్తే అలా పిలుస్తాడు ,వీడికి  అమ్మ పోలిక రాలేదు నయం .. అపర్ణ వీడి వయసులోనే ఎంత అల్లరి చేసేది , వేడిగా దోసలు పోస్తే పూరీలు అనేది ,ఇప్పటికిప్పుడు ఎలా వస్తాయే అంటే , ఆయన పోనీ లెద్దూ ,పిల్ల నోరు తెరిచి అడిగింది , ఆ మాత్రం చేసి పెట్టలేవా ? నీకింకేం పని చెప్పూ ఇంట్లో , ఉన్న మా ఇద్దరికీ రుచి గా వేళకి చేసి పెట్టడమేగా ? అంటూ వత్తాసు పలకడం ఒకటి . తండ్రీ కూతురూ ఎంత ఆడుకున్నారు తనతో .  తల్లిగా ఓ మంచి మాట చెపితే చాలు ,వెక్కిరించడం . 

ఇంకా ఏ కాలంలో ఉన్నావు నువ్వు ? ఇప్పుడు అమ్మాయిలు విమానాలు నడుపుతున్నారు అంటూ  ఒకగానొక్క పిల్లని అంత దూరం ఎందుకండీ చదువులకి అన్న నా మాట పెడ చెవిన పెట్టారు .  తన కూతురికేనా స్వతంత్రం ? నాకేది ? అంటూ నిలదీసి ఎందుకో మరి తను అడగలేక పోయింది . ఈనాడు ఇలా ఉన్నారు కానీ వయసు మీద పడి పెళ్ళి అయిన మొదలూ ఎంత సేపూ రుచుల యావ , ఆవ పెట్టి ఆనప కాయ వండూ ,ముక్కల పులుసు లో ముక్క బాగా ఉడకాలి అంటూ ఎన్ని రకాలు చేయించుకునే వారు . ఏనాడూ ఒక్క మంచి మాట లేదు ,ఎంత సేపూ వంకలు పెట్టడమే , అతనికి నచ్చినట్టు వంటలు చేసి పెట్టడమే నా ఉద్యోగం నాకంటూ మరో వ్యాపకం లేదా ? అని ఒక్క నాడూ నోరు విప్పి అడగలేదు తను . అడగందే అమ్మ అయినా పెట్టదు అని సామెత ,తనదేనా తప్పు ? 

అపర్ణ అదే కదా అంది , అమ్మా ! నువ్వు ఎప్పుడూ నాన్న మాట ఎందుకు వింటావు ? నీ ఇష్టం అంటూ ఏమీ లేదా ? అని . 

రెండు ఊతప్పాలు గబ గబా తిని , తిన్న కంచం వంటింటి సింక్ లో  పడేసి , అమ్మా ! కిందకెళ్ళి ఆడుకుంటాను , వచ్చి చేస్తాను లే హోం వర్క్ అంటూ తుర్రు మన్నాడు తనయ్ . అబ్బ !  ఎంత తేడా  తల్లీ కొడుకులకి , ఇవాళెందుకో అపర్ణ చాలా గుర్తు వస్తోంది , కోరుకున్నది చేతిలోకి వచ్చి పడిపోవాలి అనేది కూతురి లక్షణం . అలా గడిచిపోయింది తనకి .

ఇప్పుడు ఎంతయిందో సమయం ఆ అమెరికా లో , ఏమిటో ఎన్ని సార్లు చెప్పినా ఆ గంటల తేడా తన బుర్రలోకి ఎక్కదు .. అంత దూరమ్లో ఉంది పిల్ల అని బాధ వల్లనో ,ఏమో ! 

బెంగుళూరులో బీ టెక్ అంటూ వెళ్ళింది , అప్పుడే అమ్మో ఎంత దూరం లో చదువా  అని మనసుకి కొంచం బెరుకు కలిగింది , ఇంకా చిన్న పిల్ల కదా ,  ఎవరి ఆకర్షణలో పడిపోతుందో ,ఆ వయసు ఉద్రేకం వేడి తనకి తెలియనివా ! నీదంతా  ఇంకా పాత చింత కాయ పచ్చడి చాదస్తం , అంటూ తండ్రీ కూతురు కలిసి తన మాటలని వేళాకోళం చేసారు . అదేమిటో నా పట్ల అంత పాత కాలం నాటి మొగుళ్ళ ఆధిపత్యం చూపించే ఆయన కూతురి మీద మటుకు అవ్యాజ ప్రేమ చూపిస్తూ సర్వ స్వతంత్రాలూ  ఇచ్చేసారు . తల్లిగా తను ఏవో నాలుగు మంచి మాటలు  చెప్పినా కొట్టి పడేసే మొండితనం అపర్ణకి ఎవరు ఇచ్చారు .. ఈయనేగా ! 

ఒక బాధ్యత అయింది అని ఊపిరి పీల్చుకుని , కాస్త విశ్రాంతిగా ఉందాం అనుకునే సమయానికి తనకి మళ్ళీ మొదటికి వచ్చినట్టయింది .. ఈ పిల్లాడిని తెచ్చి తన ఒళ్ళో పడేసింది . 

అపర్ణ ఈ రోజు వచ్చి , అమ్మా నా పిల్లాడినివ్వు ,నే తీసుకు వెళిపోతాను అంటే తనకి గుండె గొంతులోకి రాదూ ! ఎంత ముద్దుల మనవడు తన తనయ్ , తల్లి పోలిక ఎందులోనూ లేదు , అమ్మమ్మా ! కూర్చో  ,నేను పెడతాలే కంచాలు బల్ల మీద అంటాడు , ఎవరు చెప్పారని ? తనకి ఆ మాటకే కళ్ళమ్మ ట నీరు గిర్రున తిరుగుతాయి . ఎందుకో అంత బేలగా ఉంటుంది తన మనసు . తన కూతురి స్వతంత్ర భావాల్లో  తనకి ఆవగింతైనా ఉంటే బాగుండేది కదా ! 'అపర్ణా !  నీకు నచ్చిన వాడిని మొండి పట్టు పెట్టి పెళ్ళి చేసుకున్నావు సరే , మూడేళ్ళు తిరక్కుండా వాడికీ నాకూ పడదు అంటూ , పొరపాటు జరిగింది ,ఆలోచించలేదు ఇప్పుడు నాకు మూడో నెల , ఉంచుకోనా ,తీయించుకోనా? అంటూ అమ్మ ని అడిగావు , మీ నాన్న నీ మాట అడగలేదే ! 'అంటూ తను నిలదీసేది కదా ! అలా అనలేక పోయింది తను . అదేమిటే , పసి వాడి ప్రాణాల ఉసురు కూడా పోసుకుంటావా ? నేను లేనూ ! అని అనేసింది ఆవేశంగా , దాని ఫలితమే ఈ వయసులో మళ్ళీ బడికి లంచ్ డబ్బాలు కడుతూ , వాడిని పెంచడం . 

పవన్‌ ఎంత బుద్ధిమంతుడు , తనకి చదువులో ఎంతో సాయం చేసేవాడు అంటూ ఎన్ని కబుర్లు చెప్పేది సెలవులకి వచ్చినప్పుడల్లా ,అప్పుడే తనకి అనుమానం వచ్చింది. ఈ స్నేహం ఎలా మలుపులు తిరుగుతుందో అని , ఈయన ఒక్క మాట కూడా అడిగే వారు కాదు , అందుకే కాలేజ్ కబుర్లన్నీ ఆయనకే చెప్పేది , తను వెళితే చాలు మాట మార్చేసేది , ఎంత చిన్న బుచ్చుకునేది తను , పోనీ ఈయనైనా అమ్మకీ చెప్పు ,నీ బెంగుళూరు కబుర్లు అని ఒక్క మాట అనే వారు కాదు . అదేమిటో తనని చూస్తేనే  వాళ్ళిద్దరికీ లోకువ . 

నిన్నటికి నిన్న చాలా బడలికగా ఉండి ,ఉదయమే లేవ లేక పోయింది ,  మీరు ముందు లేస్తారు కదా ,ఈ పూటకి ఆ నడక మాని , తనయ్ కి కాస్త డబ్బా సర్ది పెడతారా ? నాకు చాలా ఒళ్ళు నొప్పులూ భారంగా ఉంది అంటే ,ఏమన్నారు ? ఆ వంటింట్లో ఏవెక్కడ ఉన్నాయో నాకేం తెలుసు , ఎలాగో ఓపిక చేసుకుని నువ్వే లేచి ఆ డబ్బా కట్టేసి వాడిని పంపించేయ్ , వాడేం చిన్న పిల్లాడు కాదు , నువ్వేం వాడికి నీళ్ళూ పోయాలా ? బట్టలు వేయాలా ? అంటూ తన మటుకు తాను వెళ్ళి పోయారు . ఉక్రోషం తో కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి ..ఏం చేస్తుంది ,తప్పదు కదా , లేచి వాడిని పంపించి వచ్చి పడుకుంది .  తనకీ ఓపిక తగ్గిపోతోంది ? ఎన్నాళ్ళు వాడిని చూడగలనో ? 

అపర్ణ లాగా తను కూడా తన మనసులో మాట ధృఢంగా ఎందుకు చెప్పలేక పోతోంది , మనవడి బాధ్యత తన ఒక్కర్తి దేనా ? 
ముందు ఎమ్మెస్ అంటూ వెళ్ళింది ,అదయ్యాక , మంచి ఉద్యోగం రావాలంటే పీ హెచ్ డీ చేయాలి నాన్నా ! అని ఆయనతో ఒక్క మాట చెప్పేసి ఆ చదువు మొదలు పెట్టింది . ఈ లోపల కలిసి పని చేస్తున్నాం అంటూ జేంస్ అనే అమెరికన్‌ అబ్బాయిని ప్రేమిస్తున్నాను , మా ఇద్దరికీ కుదురుతుందో లేదో అని ముందు చూసుకుని ఆ తరవాతే పెళ్ళి చేసుకుంటాం ,మొదటిసారి లాగ కాదు ,ఆ పవన్ ఒట్టి .....అంటూ మరో బాంబ్ పేల్చి ,ఈ సారి ఈయనకీ కోపం తెప్పించింది . 

సప్త సముద్రాల అవతల ఉంది ,తన సంపాదన తనకి ఉంది ,ఏం చెప్పగలం తనకి .. ఈయన కొంచం కుంగి పోయారు ఈ సారి , తన కూతురు  చెప్పిన ఆ మాటకి . తనయ్ కైతే వాళ్ళ అమ్మ ఊసే పట్టదు ,హాయ్ అమ్మా ! అంటాడు ఫోన్‌ చేస్తే , అమ్ముమ్మ తో మాట్లాడు అంటూ నాకిచ్చేసి పారిపోతాడు , పెద్ద వాడవుతున్నాడు ,వాడి మనసులో ఏం ఉందో ? ఎంతైనా అమ్మా నాన్న సరి తూగగలమా ? 

ఈరోజు ఉదయం లేచిన మొదలూ అపర్ణ ఆలోచనలే , ఎన్ని సార్లు తలచుకున్నానో , ఎలా ఉందో ఏమిటో ? 

సాయంత్రం నడక అయింది , దీపాలు పెట్టే వేళకి ఈయనా ,తనయ్ ఇద్దరూ వచ్చారు , పొద్దున్న తడిపి పెట్టుకున్న పిండితో మాకు ఓ నాలుగు పుల్కాలూ , ఏదో ఓ కూర ,వాడికి కాస్త అన్నం పడేయాలి ,ఏ పూటకా పూట వంట అలవాటు మాన లేక పోతోంది  . 
ఇన్నాళ్ళు చేస్తున్న పనులే ఇప్పుడు భారం అనిపిస్తున్నాయంటే , తన శరీరం ఇస్తున్న సూచనలు పటించుకోవాలి తప్పదు .. ఆ రోజే రాత్రి ఫోన్‌ అపర్ణ నుంచి , అమ్మ ఉందా ! అంటూ నన్ను పిలిచి నాతో మాట్లాడింది  అమ్మా ! నీ మీద పెద్ద భారం పడేసాను ,నాకు తెలుసు , నా మంచి కోసం నువ్వు చెప్ప బోయే మాటలన్నీ నీ గొంతులోనే ఆపేసాను , ఈ జేంస్ తో కూడా నాకు సరి పడేటట్టు లేదు , ఈ పీ హెచ్ డీ అవగానే నేను మన దేశం వచ్చి ఏదో మంచి ఉద్యోగం చూసుకుని తనయ్ ని నాతో తీసుకు వెళతాను అమ్మా ! మీరు కూడా ఇంక వచ్చి నా దగ్గరే ఉండొచ్చు .. నీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మా ! అంటూ మాట్లాడే సరికి నాకు కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి .. పిచ్చి పిల్ల అంటూ ! 

తరం తరం నిరంతరం అమ్మ మనసులు మటుకు ఒక్కటేనేమో ! తమ వారిని కడుపులో పెట్టుకుని చూసుకోవడం , మేం ఉన్నామని ఎంత నమ్మకంతో వదిలి వెళ్ళింది తన కొడుకుని మా దగ్గర  .
అపర్ణ మాటలు ఇచ్చిన ధైర్యంతోనే కాబోలు మర్నాడు నేను మంచం మీద నుంచి మెలకువ వచ్చినా కదలలేదు .. ఏమోయ్ సుభద్రా ! లేస్తావా ! ఇంకా మేలుకొలుపులు పాడాలా ? అంటూ హాస్యాలు ఆడుతున్న కృష్ణారావు అంటే మా ఆయనకి స్పష్టం గా చెప్పాను " మీ మనవడి మంచి చెడ్డా , ఆకలీ అనుపానం చూడాల్సింది మనం ఇద్దరం ,  ఇక నుంచీ అది నా ఒక్కర్తి వల్ల అయే పని కాదు , నా మాట పెడ చెవిన పెట్టి , మీ అమ్మాయిని ముద్దు చేసి , గారాబం చేసి , బాధ్యత తెలియకుండా పెంచారు , అయినదేదో అయింది , ఇప్పుడు వీడి భారం మోయడం నా ఒక్కర్తి వల్లా కాదు , నేనూ నా ఆరోగ్యం సంగతి చూసుకోవాలీ ,ఉదయం నడక మొదలు పెట్టాలి  , మీరు ఒప్పుకుంటే ఓ వంట మనిషిని పెట్టుకుందాం ,కాదూ కూడదు అంటే ,మీరూ నాకు సాయం చేయాలి వంటింట్లో కి వచ్చి ,ఏవి ఎక్కడ ఉన్నాయో ఒకట్రెండు రోజులు చూస్తే అదే అర్ధం అవుతుంది , మీ ఆఫీసు లో ఫైల్స్ అవీ ఎలా తెలుస్తాయో ,ఇదీ అంతే , ఏం బ్రహ్మ విద్యా ఏమిటి ? " నా కంఠం లో ధృఢత్వం నాకే ఆశ్చర్యం కలిగించింది .. 

' అలాగే ,అలాగే అలాగే చేద్దాం ..ఏదో నువ్వు సాగుతున్నావు కదా అని నేనూ ఆ మాట అనలేదు , నీ ఇష్టమే , వంట మనిషిని పెట్టుకుందాం , ఈ డబ్బంతా మనం ఏం చేస్తాం ?  అపర్ణ నెల నెలా వాడి పేరు మీద కొంత పడేస్తోంది ,నా  అకౌంట్ లో ,ఏం చేయాలి ఆ సొమ్మంతా ! వాడి కోసమైనా  మనం ఇద్దరం ఆరోగ్యం గా ఉండాలి , అలాగే కానీ సుబ్బూ ! ' అనేసరికి .. ఆశ్చరానందాలతో నా మతి పోయింది . 

అడగందే అమ్మ అయినా పెట్టదు ..అంటారు అందుకే . 

21 మార్చి, 2017

రాజస్థాన్‌ విహార యాత్ర --మూడవ రోజు , పార్ట్ 4


జైపూర్ నుంచి వీడ్కోలు తీసుకుని  తరవాత మజిలీ రణథంబూర్ కి బయలుదేరాం ,అదే కారు ,అతనే చోదకుడు. సాయంత్రం ఆరు కల్లా చేరిపోతాం అని మాకు మాట ఇచ్చాడు .

దారిలో అంతా పసుపుపచ్చని చేలు మధ్య మధ్య లో ఎండి పోయిన నేల కనిపిస్తున్నాఅంచున అంతా ముళ్ళ చెట్లూ కంచెగా వేసారు దారి అంతా చిన్న చిన్న పల్లెటూరులు , మన దేశం అసలు స్వరూపం ఇదే అనిపించింది .

ఎనభై శాతం ప్రజలు ఇప్పటికీ వ్యవసాయంనే నమ్ముకుని ఉన్నారు అంటే మనం పట్టణాల్లో నివసించే వాళ్ళం నమ్మలేం కదా !! ఆవులూ ,మేకలూ ,గొర్రెల పెంపకాలు దారి అంతా కనిపించాయి , ఎర్రని ఓణీ తల పై కప్పుకుని స్త్రీలు ఎండిన కట్టెలుని ఇక్కడా ,అక్కడా సంపాదించి తల పై ఇంతింత పెద్ద మోపులతో ఇంటిలో పొయ్యిల కోసం మోసుకు వెళుతూ కనిపించారు , దారి అంతా   ఎర్రని ఇటుకలతో  పొలాల మధ్య కట్టిన డాబా ఇళ్ళూ , వీధి గోడలకి కొట్టిన పిడకలూ , మన దేశం లో జరుగుతున్నంత రీసైక్లింగ్ ఇంకెక్కడా ఉండదేమో ! పల్లెటూరుల్లో కంపతో పొయ్యి అంటించి వంట వండుకుంటారు వినడమే కానీ మనం చూడం కదా , బోరింగ్ పంపులు ఉన్నాయి వ్యవసాయానికి నీళ్ళూ కాలువ ద్వారా వస్తాయి అనుకున్నాను .
 
ఆవపంట చాలా ఎక్కువ గా కనిపించింది ..ఎంత పచ్చగా ఉన్నాయో ఆ చేలు . సాయంత్రం అవుతూ ఉంటే రోడ్డు వారగా సైకి ల్స్ తొక్కుతూ ఆడ పిల్లలు బడి నుంచి ఇంటికి వెళ్ళే సుందర దృశ్యం కనిపించి ,ఎంత ఉత్సాహం గా అనిపించిందో , ఒక అమ్మాయి చదువుకుంటే ఒక కుటుంబం చదువుకున్నట్టే అంటారు కదా !!

దారిలో రచ్చ బండ వద్ద తలపాగాలు కట్టుకున్న పెద్దలు తాపీగా చేతి కర్రల మీద తలలు ఆంచి ,చర్చలు జరుపుతూ కనిపించారు ..మన పల్లెల మౌలిక రూపాలు మన దేశం లో యే మూల కి వెళ్ళీనా ఒక్కటే అనిపించింది .. ఆ తల పాగాలు , పగిడీ లంటారు  వాటి రంగూ , కట్టిన విధానం బట్టి , ఎవరికీ చెప్పకనే తెలుస్తుందిట ,సమాజమ్లో వారి అంతస్తూ ,కులమూ .. రాజస్థాన్‌ లో కులాల ప్రాముఖ్యత ఇంకా బాగా బలంగా ఉన్నట్టు కనిపించింది ,అదే మాట మా గజేంద్ర చెప్పాడు . కులాల మధ్య పెద్ద గొడవలు జరిగేది ,కుల కట్టు దాటి పెళ్ళిళ్ళూ అవి జరిగినప్పుడే ట , లేక పోతే ఎవరి  పరిధుల్లో వాళ్ళు తమ కుల వృత్తులు చేసుకుంటూ ఉంటారు అని వినగానే మన పల్లెటూరుల్లో మార్పు మరెన్ని వందల ఏళ్ళు పడుతుందో అనిపించింది అయితే ఆ కుల విభజన వల్ల ,వారి రోజు వారీ పనులలో ఎటువంటి తభావతు రాదు అంటూ తన అభిప్రాయం చెప్పాడు . 

తన రాజ్పుట్ పుట్టుక గురించి చాలా గర్వ పడుతూ కనిపించాడు అతను , తన కుటుంబం లో అతనే ఇప్పటికీ పెద్ద ,కొడుకుల కి పెళ్ళిళ్ళు అయినా ,భార్య ,కోడళ్ళూ అతని ఆజ్ణ మీరరు అని మాటల్లో గొప్పగా చెప్పాడు .. నా మనసులో ఏం అనుకున్నా ,అతనిని ఆద్యంతం చాలా ఆసక్తిగా గమనిస్తూ వచ్చాను .

రాజ్పుట్ లు అని అందరిని అన్నా వారిలో  కూడా హైరార్కీ ఉంటుంది అని చాలా పేర్లు చెప్పాడు , కానీ ఆ పేర్లు అంత గుర్తు లేదు . గుజ్జర్ ,మీనా కులాలు వెనకబడిన కులాలు అని అన్నాడు ,అయితే వారికి ప్రభుత్వం ఇళ్ళూ అవి కట్టించి ఇస్తోంది అన్నాడు . వారి పరిస్థితి మునుపటి కన్నా ఇప్పుడు బాగుంది అని కొంచం తటపటాయిస్తూ చెప్పాడు . ఇదే కదా మన దేశం ,భారత దేశం , మార్పు ఇంచ్ ఇంచ్ గా వస్తోంది .

మధ్యలో టీ కని ఆగాం ,అక్కడా ఓ చిన్న షాప్ ఉంటుంది , ఆ మోహం ని తప్పించుకుని చీకటి పడుతూ ఉండగా రణ థంబోర్ చేరాం ..చాలా వరకూ రోడ్డు బాగో లేదు ,ఈ ఊరిలో మరీ దారుణం గా ఉంది .ఊళ్ళో మరొక టూర్ ఆఫీసు అతను ఎక్కి మాకు దారి చూపించాడు , మా టైగ్రెస్ హోటల్ , అది ఈ మధ్యే కొత్తగా కట్టిన హోటల్ , రాజభవనం లాగా కట్టేరు .మాకు ఆ ఆవరణ లోనే విడిగా ఉన్న విల్లాలు   ఇచ్చారు .. విశాలమైన గదులూ , కరెంట్ తో నడిచే ఫైర్ ప్లేసూ , అన్ని టాప్ క్లాస్ వసతులతో చాలా బాగుంది ..ఆ రోజుకి భోజనాలు కానించి ,పడుకున్నాం .

ఉదయం తొమ్మిదికల్లా వచ్చాడు , ఆ అడవిలో మా జీప్ టూర్ మధ్యాన్నం ఒంటి గంట నుంచి అని చెప్పారు , ముందుగా మాకు ఒక జీప్ బుక్ చేసి పెట్టారు టూర్ వాళ్ళు , ఎక్కడికక్కడ అన్ని వసతులూ వారే సమకూర్చి మాకు పెద్దగాప్రయాస లేకుండా చేసారు , ఇక్కడకి వచ్చిన వాళ్ళు అందరూ ఇలాగే ఏదో ఒక ఏర్పాటు చేసుకుంటారు అని చెప్పారు .

మేం ఉదయం అలా చక్కరు కొట్టి వద్దాం అని బయలుదేరి ఈ అభయారణ్యం ఒక చివరకి చేరుకున్నాం ..దారిలో రోడ్డు పక్కనే ప్రశాంతంగా పచ్చిక మేస్తూ లేళ్ళూ ,జింకలూ ,చాలా కనిపించాయి ,అవి అరణ్యం గోడ దాటి వచ్చిన అల్లరి బడి పిల్లలు లాంటివి అన్నమాట ..మరొక చోట మన వారసులు కోతులు గుంపులు గుంపులుగా , మరొక నీటి సరస్సు చుట్టూ గడ్డి పొదలూ , వాటిలో కలిసి పోయి గట్టు మీదకి చేరి ఎండకి కాచుకుంటున్న రెండు ,మూడు మొసళ్ళు కనిపించాయి ,అవన్నీ వాహనం నడుపుతూ అతనికే ఎలా కనిపించాయో , అంత నిశితమైన చూపు మా గజేంద్రం ది అని మెచ్చుకున్నాం.

ఒక ప్రదేశం లో గుడి ఉంది అని చూపించాడు ,ఎత్తుగా ఒక కొండ మీద ఒక కోట ఉంది ,ఆ కోటలో దేవీ మాత గుడి ఉందిట ,అంబా మాత అని కొలుస్తారుట , ఉత్సాహం గా కొంతమంది పిల్లలు కొండ ఎక్కుతూ కనిపించారు ..మాకంత సమయమూ ,ఓపికా లేదు కాబట్టి ,వెనక్కి హోటల్ కి వచ్చి ,భోజనం చేసి మా ఒంటి గంట అభయారణ్య టూర్ కి తయారుగా కూర్చున్నాం .

మాకు ఆ వనం లో ఆరవ భాగం వచ్చింది అని చెప్పారు , నిన్న ఎవరికో పులి కనిపించింది అంటూ కథల్తో ఊరిస్తూ ,ఊరంతా తిప్పి మేం ఉండే వేపు కి వెనక వేపుకి తీసుకు వెళ్ళారు , ఆ జీప్ ,ఓపెన్‌  జీప్ , వెనక మేం ఇద్దరమే , ముందు చోదకుడూ ,ఒక గైడూ ..అడవిలోకి ప్రవేశించాం . 

ఆ జీప్లో ప్రయాణం , ఆకాశంలో జైంట్ వీల్లో రైడ్ లాగా ఉంది ..రాళ్ళ మీద నుంచి ఎక్కుతూ ,కొండలు దిగుతూ ,పులి కోసం వెతుకుతూ ప్రయాణం మొదలుపెట్టాం , కోతులూ ,జింకలూ అందులో బ్లాక్ బక్స్ , చెట్టు మీద పక్షులూ ,పిట్టలూ ,ఒక చోట గుడ్ల గూబ , అడవి దున్న ఇలాంటివే కనిపించాయి ,కానీ పులి మటుకు దాక్కుంది ..మాకు ఎదురు పడడానికి భయపడి ..అని నవ్వుకున్నాం ..

3 ,4 గంటలు అలా తిరిగి ,ఒళ్ళు హూనం చేసుకున్నాక ఇంక ఇంటి దారి పట్టాం ..ఇంక మర్నాడు మధ్యాన్నం మా తరవాత మజిలీ జోధ్ పూర్కి ప్రయాణం . 
ఉదయమే అటూ ఇటూ తిప్పి ,తన సొంత అజెండా ఒక హాండీ క్రాఫ్ట్స్ షాప్ కి తీసుకువెళ్ళాడు ,అయితే అది మహిళలు నడుపుతున్నారు అనగానే నేను చాలా విజృంభించి గాజులూ ,పూసలూ మరి కొన్ని వాల్ హంగింగ్స్ లాంటివి  కొన్నాను ..ఆవిడ తో ఓ ఫోటో కూడా తీసుకున్నాను .

ఇంక అక్కడ నుంచి 9 గంటలు ప్రయాణం చేసి ,జోధ్ పూర్ చేరాం . ఆ రాత్రి కి మేం విడిది చేసిన హోటల్ కూడా ఒక పెద్ద పాలస్ , ఆ పాలస్ ఇంకా ముందుకి ఉందిట అక్కడ ఒక సరస్సూ , చుట్టూ తోటలూ ,చీకట్లో కూడా చెట్లూ ఆకుపచ్చగా మెరుస్తున్నాయి , భోజన శాల లో ఇంగ్లీష్ కాలం నాటి గుర్రాల ఫోటోలూ ,పొలో ఆటలు ఆడుతున్న రాజ్పుట్స్ , ఇలా అంతా ఒక బ్రిటిష్ వాతావరణం లో ఉంది .. అయితే వైటర్స్ మటుకు పగిడీలు కట్టుకుని చాలా మర్యాదగా వడ్డించారు . 

తొమ్మిది గంటలు అనుకున్న ప్రయాణం మరి కొంత ఎక్కువ సమయమే పట్టడం వల్ల ,మేమూ అలసిపోయి నిద్ర పోయాం .           ఉదయమే మరొక కొండ ఆ పైన ఒక పెద్ద కోట ,అనుకుంటూ  కాళ్ళకి మరింత బలం ఇమ్మని ప్రార్ధిస్తూ నిద్ర పోయాను .

ఈ రాజస్థాన్‌ నిజంగా రాజుల కి ఆస్థానమే , అనుకున్నాం ..ప్రతి ఊరిలోనూ కోటలూ ,పాలస్ లూ ,ఆ పెద్ద పెద్ద భవనాలూ కొన్ని ప్రభుత్వం తన ఆధీనం లోకి తీసుకుని , నడుపుతోంది ,కొన్ని మటుకు రాజుల ఆధీనం లో ఉన్నాయిట , వారికే వెళుతుందిట్ ,ఈ టికెట్లు అమ్మిన డబ్బులూ అవీ ,మరి కొన్ని సేవలని ఔట్ సోర్స్ చేసి ఈ పాలస్ లని తామే స్వయంగా నడుపుతున్నారు ట .

ఇలాంటి విషయాలే కాక ,ఆ రాజుల కుటుంబ చరిత్రలు ఎన్నో మాకు కొసరు కథలు గా వినిపించాడు. రాజ్యం చేస్తున్న రాజ్పుట్ వంశం లో పిల్లలు పుట్టరని శాపం ఉందిట , అందుకే  చాలా తరలు వరకూ దత్తత తీసుకున్న వాళ్ళే రాజ్యం ఏలారుట , ఇప్పటి రాజు గురించి చెపుతూ ,అతను ఇరవై ల లో ఉండగా పోలో ఆడుతూ గుర్రం నుంచి పడి పోయి ,తలకి పెద్ద గాయమై ,ఎన్నో నెలలూ ,ఏళ్ళు కోమాలో ఉన్నాడు ట , అమెరికా కి కూడా తీసుకువెళ్ళారు ట ,చివరకి ఆ ఊరి దేవత అంబా దేవిని కొలిస్తే , అతను కోమా నుంచి మిరకెల్ గా బయట పడ్డాడుట ,అతనికి  ఇద్దరు పిల్లలు ,అబ్బాయి విడేశాలలో చదువుకోడం ., అమ్మాయి వివాహం చుట్టూ జరిగిన వివాదాలూ అన్నీ చిలవలూ పలవలూ గా చెప్పాడు , కారులో కూర్చుని మేం ఈ కథలని విన్నాం , అప్పటికి ...మాకు అవే కాలక్షేపం మరి .

ఉదయమే మా హోటల్ ఖాళీ చేసి మళ్ళీ యాత్రీకులమై బయలుదేరాం , ఆ రాత్రి కి మా బస మరో ఊరిలో మరి . జోధ్ పూర్ లో ఉన్న మెహ్రార ఘర్ కోట దర్శనానికి బయలు దేరాం , మార్వార్ వంశం వారు జోధ్ పూర్ రాజధాని గా రాజ్యం ఏలారుట , థార్ ఎడారి మొదలయేది ఇక్కడ నుంచే .ఈ పటణాన్నే " సన్‌ సిటీ " అని కూడా అంటారుట , ఏడాది పొడుగునా ఈ ఊరి మీద సూర్య కిరణాలు పడతాయని ఆ పేరు వచ్చింది .. మరొక పేరు కూడా ఉంది , బ్లూ సిటి అని , పూర్వ కాలంలో నీలి రంగు బయట గోడలకి వేయడం వల్ల ఇల్లు చల్లగా ఉంటుంది అన్న ఉద్దేశం తో అలా చేసేవారుట , కోట కింద నున్న ఊరు మటుకు అలా నీలం రంగులో కనిపించింది ,మిగిలిన ఊరు అంతా ఇప్పుడు అలా లేదు .

పాకిస్థాన్‌ కి దగ్గర గా ఉండడం వల్ల - 250 కిమి - ఇక్కడ ఎయిర్ బేస్ ఉంది , ఆర్మీ ట్రక్కులూ ,జీప్స్ ఊరంతా తిరుగుతూ కనిపిస్తాయి . 

మెహ్రాం గర్హ్ కోట అన్ని కోట ల లాగే ఒక ఎత్తైన కొండ మీద కట్టారు , శత్రు దుర్బేధ్యం గా పెద్ద పెద్ద ద్వారాలూ  ,అవి కదపాలి అంటేనే ఒక పెద్ద పటాలం కావాలి ,అంత బరువు గా ఉన్నాయి , ఆ తలుపులు , మనం మెల్లగా నడుస్తూ పైకి వెళ్ళ గానే ఒక విశాలమైన అవరణ లోకి అడుగు పెడతాం , అక్కడే పెద్ద కాన్యంన్‌ లు అంటే ఇప్పటి మన మిసైల్ వేసే టాంక్ లాంటివి ఉన్నాయి ,నాలుగు మూలలా , ఆ టాంక్ వద్దే మాకో ఫోటో , ఇక్కడా మేం ఒక గైడ్ తీసుకున్నాం . అతని సలహాపై , పై అంతస్తు కోట లోకి వెళ్ళడానికి లిఫ్ట్ వాడుకున్నాం ,కొంత రుసుము కట్టి . 

చాలా గదులు మ్యూజియం గా మార్చారు , రాజులు వాడిన వస్తువులూ ,కళా రూపాలూ ,వాళ్ళు ఎక్కిన పల్లకీలూ ,చిత్ర పటాలూ ,రాణీ వాసం గదులూ అన్ని ఒక్కొక్కటి చూసుకుంటూ కిందకి దిగాం . ఒక్కొక్క గది లో అలంకారాలూ ,చెక్కిన జాలీ కిటికీలూ అవన్నీ చూస్తూ , వీలు ఉన్న చోట అల్లా ఫోటోలు తీసుకుంటూ , చాలా మైళ్ళే నడిచాం ఆ కోటలో అనిపించింది . 

మధ్య మధ్యలో జనానా సరదాలు తీర్చుకునే చిన్న నీటి కొలనులూ , వాటి చుట్టూ అలంకరించిన గోడలూ అన్ని అత్యద్భుతం అనిపిస్తాయి .  ఒక గదిలో మార్వారీ చిత్రాలు అపురూపం అనిపిస్తాయి ,అవి మన పురాణాలలో వర్ణించిన అనేక దృశ్యాలు .. బంగారు రంగులో మెరుస్తూ ,అవి ఎంత విలువైనవో చెపుతాయి . 

ఈ కోట కి వెళ్ళక ముందు ఒక చిన్న కొండ పై రాజుల సమాధులు ,వాటి చుట్టూ తోటలూ , నీటి మడుగులూ తో అందంగా ,ప్రశాంతంగా ఉంది .
తెల్లని పాల రాయితో చేసారు , ఈ రాష్ట్రం లో పాల రాయి చాలా ఎక్కువగా దొరుకుతుంది , మన ఇళ్ళ ల్లో వేసే పాల రాయి కూడా ఇక్కడ నుంచి వచ్చిందే . 

ఈ ఎడారి రాష్ట్రం లో పాలరాయి గనులూ , ఆఖర్కి నల్లటి పాల రాయి తో సహా ఉన్నాయి ,అవి కాక గ్రానైట్ , సున్నపు రాయి , విలువైన రాళ్ళూ , ఇలా ఎన్నో దొరుకుతాయి ట , వరీ ,గోధుమా లాంటి పంటలు పండే వీలు లేదు కానీ దాని బదులు ఈ ప్రదేశం లో ఇలాంటి విలువైన రాళ్ళ సంపద దొరుకుతుంది . ఒకటి ్ కాక పోతే మరొకటి ఇస్తుంది ,ప్రకృతి . ఏడాది పొడుగునా వ్యవసాయ పనులు ఉండవు కాబట్టి , చాలా మంది చేతి పనులు చేసే కళ లో ఆరితేరారు , బ్లాక్ ప్రింటింగ్ , పాల రాయిలో విలువైన రాళ్ళు పొదిగే పనులూ , పూసలూ వాటితో దండలూ , ఇలా ఎన్నో హస్త కళ ల వస్తువులు చూసి ,పరవశీంచాం , నీలి రంగు పాటరీ , చేతి కాగితం తో తయరు చేసిన కవర్లూ ,సంచులూ ,చేతి కుట్టుతో , పాత వస్త్రాలు ఉపయోగించి తయారు చేసే బొంతలూ ,ప్రతీ వారూ ఏదో ఒక కళ లో నిష్ణాతులు అనిపించారు . 

ఎడారి రంగు నిస్తేజంగా ,ఇసక రంగులో ఉంటే , దానిని రంగుల మయం చేసారు అక్కడ పని వారు ,తమ కళలతో .. ఈ చేతి పనులు చూడ డానికే కొన్ని రోజులు మనం విడిగా రాజస్థాన్‌ చూడాలి అసలు , కోటలూ ,మహళ్ళు అవీ చరిత్ర ,నేటి ప్రజా జీవితం లో ఇన్ని రంగులు నిండి ఉన్నాయి ,వాళ్ళ దుస్తులు కూడా అంతే , చాలా నదురు రంగులు , ఇంక రోడ్ మీద ఏక తారా వాయిస్తూ కళా కారులు పాడే , వాయించే పాటలు విని తీరాల్సిందే , వీళ్ళ తో పాటు చిన్న పిల్లలు కంఠం లో తేనె పోసినట్టూ , రాగాలు తీస్తూ ,జానపద గీతాలు పాడుతూ ఉంటారు ,ఇలాంటి వాళ్ళ లోంచే మన అమీర్ ఖాన్‌ తన దంగల్ సిన్మా కి తీసుకున్నాడు ట ,ఇద్దరు చిన్నారి పాట గాళ్ళను . 

జన సమూహాలతో , పాటలతో ,రంగులతో ఎంత అందంగా ఉందో ఈ రాష్ట్రం ,అనిపించింది .

ఈ కోట చూసాక , భోజనాలు చేసి ,మేం రాత్రి ఎడారి లో  టెంట్ లో రాత్రి గడప డానికి ్ జై సల్మేర్ బయలుదేరాం . 

రోడ్డు ఫరవాలేదు , చాలా చోట్ల పక్క నుంచి వెళ్ళమని బోర్డులు పెట్టారు , నాలుగు లైన్ల రోడ్ ల నిర్మాణం జరుగుతోంది , మనం పూర్తిగా పశ్మిమా నికి మనం పొరుగు దేశం పాకిస్థాన్‌ వేపు వెళుతున్నాం అన్న మాట .

మా చోదకుడు చెప్పిన ఒక విషయం చాలా ఆసక్తికరం గా అనిపించింది ..ఇక్కడి రాజులు వందల ఏళ్ళ క్రితం ఆఫ్ఘనిస్తాన్‌ , ఇంకా పైన ఇరాన్‌ వరకూ విజయ యాత్రలు చేసారుట , మన దేశం మాప్ అక్కడ వరకూ ఉండేది అన్న మాట , ఇవన్నీ చరిత్ర కారులు  చెప్పాలి కానీ మన చరిత్ర లో ఎన్ని విశేషాలూ , ఆసక్తికర విషయాలు ఉన్నాయో కదా ,మొహంజాఓ దారో హరప్పా నాగరికత వెలసిన దేశమే కదా మనది ..

మొత్తానికి రాత్రి పది అవుతూ ఉండగా ఎక్కడో నడి సముద్రం లో అన్నట్టూ ఎడారి మధ్యలో ఉన్న ఆ కాంప్ కి చేరాం . ఆరు బయల ఆకాశం కింద ఆ ఎడారి లో ఒక వేదిక కట్టీ ,దాని మీద జానపద నృత్యాలు చేస్తున్నారు ..5 , 6 డిగ్రీలు ఉంటుందేమో , తారు డబ్బాలలో నెగళ్ళూ పెట్టారు , భోజనం బఫే పద్ధతిలో , మేమూ ఆ నృత్యాలు చూసి ఆనందించాం .ఉత్సాహం ఉన్నవారూ వేదిక ఎక్కి వాళ్ళతో కలిసారు ,మన బాలీవుడ్ డాంసుల కి ,ఇంతకీ ఎంతో అందంగా కనిపిస్తూ , ఒళ్ళు రబ్బరు లాగా సాగదీస్తూ నాట్యం చేస్తున్న ఆమె - అతడు ప్రింస్ హరీష్ అని ఇండియన్‌ ఐడల్ లో ఫైనల్స్ కి వచ్చిన అతనుట చాలా బాగా చేసాడు . 

రాత్రి కి ఆ ఎడారి టెంట్ లో ..అన్ని సదుపాయాలూ ,హీటరూ ఉన్నాయి , హాయిగా నిద్ర పోయి ఉదయమే చలిలో వణుకుతూ , అల్పాహారాలు లాగించి ,మళ్ళి మా సామాన్లు కార్ లో పడేసి ,జైసల్మార్ ఊరి వేపు బయలుదేరాం ..ఊరి నుంచి 40 కి మి దూరం లో ఉంది ..ఈ  రెసార్ట్ . 

దారి మధ్యలో మరో పెద్ద పాలస్ ,అదే మా హోటల్ ట ,అక్కడ సామాన్లు పడేసి ,ఊరి మధ్యలో ఉన్న మరొక కోట చూడ డానికి బయలుదేరాం .. 

ఇవాళ్టికి ఇక్కడతో కామా పెడుతున్నా ..రేపు మిగిలిన భాగం ..




రాజస్థాన్‌ విహార యాత్ర , రెండో రోజు .. 3 వ భాగం .


జైపుర్ లో రెండవ రోజు అక్కడకి 11 కిలోమీటర్ల దూరం లో ఉన్న అంబర్ కోట చూడాలని నిశయించుకున్నాం , ఉదయం తొమ్మిదికల్లా మేం తయారయి , బయటకి వచ్చాం .. మా వాహన చోదకుడు గజేంద్రన్‌ కూడా సరిగ్గా సమయానికి వచ్చి పదండి అంటూ ఆహ్వానించాడు ..
ఇప్పటి వరకూ మేం చూసిన జైపూర్ అంతా కొత్త గా అభివృద్ధి చేసిన ఊరేమో , 4 వరసల రోడ్డు తో అటూ ఇటూ పచ్చదనం ,మధ్యలో కూడా పూల మొక్కలతో అందంగా ,విశాలంగా ఉంది అని మేం సంతోషించాం. జైపూర్ని పింక్ సిటి అంటారు అని విన్నారు కదా .అసలు జైపూర్ ఊరు మటుకు స్వచ్చ్ భారత్ లేమి కనిపిస్తూ ,ఇరుకు ఇరుకుగా జన సందోహాలూ ,బజార్లూ , రకరకాల వాహనాల రొదలతో పాత పట్టణం పోకడలతో కనిపించింది .
ఈ పింక్ సిటి మహరాజా జై సింఘ్ 2 అనే రాజ్పుట్ రాజు గారు నిర్మించారు . ఈ ఊరు చుట్టూ పెద్ద గోడ నిర్మించారు , లోపల ఉన్నది అంతా పింక్ సిటి అన్న మాట . మరి గోడ అన్నాక దర్వాజాలు ఉండాలి కదా ,ఈ ఊరిలోకి ప్రవేశం కొరకు ఏడు విశాలమైన ప్రవేశ ద్వారాలు ఉన్నాయి . 
సూర్యుని పూజించే వంశం అనీ ,వారి పూర్వీకులు సూర్య వంశం వారనీ వారు ఈ ప్రవేశ ద్వారం ఒక దానికి సూర్య పోల్ అనీ ,మరొక దానికి చంద్ర పోల్‌ అని పేరు పెట్టారుట , ముఖ్యంగా సూర్యుని ఎదురుగా అంటే తూర్పు దిక్కున ఉన్న ద్వారానికి అలా పెట్టి ఉంటారు .ఇదేదో గోడ అంటే మనం చూసే మామూలు గోడలు కావు సుమండీ ,ఆరు మీటర్ల ఎత్తూ ,మూడు మీటర్ల వెడల్పూన ఉండే ఈ గోడల మీద సైనికులు హమేషా కాపలా తిరిగే వీలు ఉండేది అన్న మాట .
ఆ ప్రవేశ ద్వారాలు కూడా విశాలంగా ఏనుగులు ఆ పై అంబారీలు కూడా తిరిగే వీలుగా ఉన్నాయి , ఇప్పుడు మటుకు ప్రస్తుతం ,మన వాహనాలు ఎడ తెడిపి లేకుండా అటూ ,ఇటూ తిరుగుతున్నాయి , కాలం ఎంత మారిందో ,ఈ ద్వారాలుకే నోరు ఉంటే ఎన్ని కథలు చెప్పేవో అని నాలోని రచయిత్రి నిట్టూర్చింది .. :) 
మా వాహనంని మెల్లగా తోలుతూ ,మా చోదకుడు అలా ఊరి చరిత్ర అంతా చెపుతూ ఉండేవాడు , హవామహల్ అని ఎంతో ప్రాముఖ్యత పొందిన పెద్ద భవంతి అసలు ఉత్త గోడ లాంటిదే , రాణీ వాసం వాళ్ళు చూడ డానికి వీలుగా వందల కిటికీల జాలం తో నిర్మించారు అని తరవాత మాకు తెలిసింది . ఆ గోడ అంతా పింక్ సిటీ చుట్టూ కట్టబడిన గోడ అన్నమాట . బజారు వేపు వరసగా చిన్న చిన్న కొట్లుగా ఇచ్చారు ,అవి రాజుగారి కాలం లో అద్దె కిచ్చిన కొట్లు ట ,ఒక్కోదానికి పది రూపయిలు ట అద్దె , అందుకే అవి పాత గా కొంచం జీర్ణ స్థితి లో ఉన్నాయి ,కానీ ,జైపూర్ పట్టణానికి కావల్సిన ముఖ్యమైన వర్తకం అంతా అక్కడే జరుగుతున్నట్టు కనిపించింది . హోల్ సేల్ వర్తకం అంతా అక్కడే జరుగుతున్నాట్టుంది , రంగు రంగుల బట్టలూ , ఆభరణాలూ , బాగా విలువైన రాళ్ళతో తయారు చేసిన వెండి నగలూ ,జరీ చెప్పులూ ,మధ్య మధ్యలో పతంగ్ లూ ,చేతి కాగితం తో తయారు చేసిన సంచులూ ,కవర్లూ , ఒకటేమిటి , ఆ రోడ్డు నిండా అటూ ,ఇటూ దుకాణాలే , కొనడానికి వచ్చిన వారూ ,ఆ దుకాణం దారులూ ,మధ్యలో మన వాహనాలూ తో కిక్కిరిసి పోయి ఉంది ,వీరికి తోడు వెల్లువలా వచ్చి పడే టూరిస్ట్స్ , అందులో మళ్ళీ ఎన్ని వైవిధ్యాలో ,కార్ల లో ,బస్సులో , లోకల్ గా నడిచే మెట్రో ఆటో ల లో , ఆటోల లో ఇలా రక రకాలుగా వచ్చి పడి పోతున్న టూరిస్ట్స్ ని ఆకట్టు కోడానికి ,చిరు తిండ్లూ , విసనకర్రలూ , ఐస్ ఫ్రూట్లూ ,ముక్కలు కోసి అమ్మే పండ్ల ముక్కలూ ,లస్సీలూ , మురీ మిక్సరూ , బాబోయ్ ఎన్ని రకాలో నేను వర్ణించలేను ..
వీరందరి మధ్య హవాయ్ చెప్పులూ ,రంగు రంగుల స్కర్ట్ , పైన ఓ జైపూర్ కుర్తా , భుజాన ఓ జోలీ ,కళ్ళకి నల్ల కళ్ళ జోడూ , చేతిలో జైపూర్ టూర్ గైడ్ పుస్తకం ,నడుముకి కట్టుకున్న తోలు పటకాలో బంధించిన రూపాయిలూ ,డాలర్లూ ,ఇంకెవరూ విలాయత్ టూరిస్టులు ,వారి కళ్ళ పడాలి అని బెల్లం చుట్టూఉ మూగే ఈగల్లాగా గైడ్లూ ,మిగిలిన అమ్ముకునే వాళ్ళూ, అంతా ఓ రంగుల హేల ,మానవ సముదాయ మనుగడ లో వైవిధ్యత అంతా అక్కడే ఉంది ..కారులోంచి తొంగి చూస్తూ ,కమెరా సంగతి తరవాత అంటూ నా కళ్ళ తో చూస్తూ అన్ని చిత్రాలను నా మనసులో పదిల పరుచుకున్నాను .
నన్ను అక్కడ వదిలేస్తే ఓ వారం ,పది రోజులు ఆ దుకాణాల గుమ్మాలూ ఎక్కుతూ ,దిగుతూ ,ఓ గూడ్స్ బండికి సరిపడా వస్తువులు కొని పడేసి ఉండే దాన్ని ,ఇలాంటప్పుడే తను నాలో భావావేశం గమనించి ,ఎంతో ప్రేమగా నా చెయ్యి గట్టిగా పట్టుకుని ఆపుతాడు ..( ఈ విషయం ఇదీ అని అర్ధం అవడానికి ,నాకు ఓ పాతికేళ్ళు పట్టింది ) 
అలా ఆ బజారు వీధీ చంద్ పోల్ అనే ద్వారాలు దాటుతూ ,మేం ఆ కోట మార్గం పట్టాం . దూరంగా కొండలూ ,ఆ కొండ పై హారం లాగా అమర్చిన గోడా కనిపించాయి , ఈ కొండలన్నీ ఆరావళి పర్వత శ్రేణి లో భాగం అని చెప్పారు ,గుజరాత్ నుంచి మొదలయి ,ఈ పర్వత శ్రేణి దిల్లి వరకూ ఉన్నాయి .
ఉత్తర భారతం అంతా శత్రు దేశాల రాక పోకలకి అనువుగా ఉంటాయి ,ఈ పర్వతాలూ ,మరొక వేపు హిమాలయాలు మనకి సహజమైన రక్షణ ఇచ్చినా రాజ్పుట్ రాజులు తమ కోటలు ఎత్తైన పర్వతాల మీద కట్టుకుని ,ఇంకా రక్షణ కోసం ఆ కొండల పై ఇలా పెద్ద గోడలు కూడా కట్టారుట , ఎంత మంది కూలీలు ,ఎంత వ్యయం పెట్టి కట్టి ఉంటారో కదా , అయితే ఆ కొండ లపై దొరికే రాయినే కొట్టి వాటినే ఉపయోగించి కట్టినట్టు తోస్తుంది . 
అమెర్ కోట కూడా అలాగే ఓ ఎత్తైన కొండ పై కట్టారు , ఆ ప్రదేశం లో మీనా కారీ అని మనకి పరిచయం అయిన చేతి పనులు చేసే వారు ఉండే వారు ట ,వాళ్ళు ఆ కొండ జాతి వారు , వారి ఊరు ,దేశం అది .. అయితే రాజా మాన్‌ సింఘ్ అనే రాజ్పుట్ ,ఓ నాడు వేట లో అలసి పోయి ,ఆ కొండల లో విశ్రమిస్తూ ఉండగా అతనికి ఓ సిద్ధువు చెప్పాడుట ,ఇక్కడ నీ కోట కట్టుకో అని .. రాజు తలుచుకుంటే అన్నట్టూ ,అతను ఆ మీనా జాతి వారితో యుద్ధం చేసి ,వారిని ఓడించి , ఆ కొండ పై కోట మొదలుపెట్టి అంచెలంచలు గా 150 ఏళ్ళూ నిర్మించారుట ..
మీనా జాతి వారిని అతి కిరాతకంగా చంపేసిన ఓ రాజు గురించి వింటే ఆ కోట లో ఎంత మంది కన్నీళ్ళూ ,రక్తమూ కలిసిందో అని చాలా బాధ కలిగింది .
ఒక తరం తరవాత ఒక తరం అలా విస్తరించుకుంటూ కట్టారు ,అన్నమాట ఈ కోట .

సూరజ్ పోల్ అనే ద్వారం దాటి వెళీతే ఓ విశాలమైన జలీబీ చౌక్ అనే ప్రాంగణం వస్తుంది , ఒక వేపు గుర్రాల ,ఏనుగుల  శాల లూ ,మరొక వేపు ,అక్కడ పని చేసే సైనికులూ , సేనాధిపతులకూ నివాస గృహాలూ , వస్తాయి . గుండ్రంగా ఉన్న ఈ ప్రాంగణం కి అందుకే జిలేబి చౌక్ అని పేరు .

గణేష్ పోల్ అనే ద్వారం గుండా ,విశాలమైన మెట్లు ఎక్కి, రాజా వారి నివాస గృహ సముదాయానికి ప్రవేశించాలి . కాళీ మాతని కొలిచే గుడి కూడా అక్కడే ఉంది , దసరా సమయలలో బలులు ఇచ్చేవారుట ,ఈ మధ్య వరకు .
దివాన్‌ ఎ ఆమ్‌ అంటే ప్రజల కోసం దర్శనం ఇచ్చే ప్రదేశం అని ..రాజు గారు అక్కడకి వచ్చి ప్రజల సమస్యలు వినే వారుట , దివాన్‌ ఏ ఖాస్ అంటే ముఖ్యమైన వారికోసం ఈ హాల్స్ అన్నీ సుందర మైన చెక్కడాలు తో కళ్ళు చెదిరే సౌందర్యం తో ఉంటాయి , జనానా చూసేందుకు ,వెండి , పాలరాయి జల్లెడ లాంటి జాల చెక్కడాలతో నింపిన గోడలూ , కిటికీలూ ,ఇవన్నీ మనం కంటి తో చూడ వల్సినదే కానీ ,వర్ణించాలి అంటే మాటలే దొరకవు .
అలా అంచెలు అంచెలుగా రాజా వారి నివాస భవంతులు అన్నీ చూస్తూ పై వరకూ వెళతాం ..అక్కడ నుంచి చూస్తే దూరంగా కొండల పై పాము లాగా చుట్ట చుట్టలుగా నిర్మించిన గోడ కనిపిస్తుంది ..ఈ ఫోటోలు అన్నీ జైపూర్ యాత్ర అనే ఆల్బం లో పెట్టాను . 

మేం ఓ గైడ్ సహాయం తీసుకున్నాం ,అతను ఆ కోట చరిత్ర అంతా వివరిస్తూ ,ముఖ్య స్థలాలలో మా ఇద్దరికీ ఫోటోలు తీయడం నాకు చాలా నచ్చింది ..లేక పోతే ఇద్దరికీ కలిపి ఎవరు తీస్తారు ..అక్కడకి వచ్చిన వారందరూ ఇదే పని లో ఉంటారు ..ఫోటోలు తీసుకుంటూ ,పైగా మనకి ఆ స్థలం ప్రాముఖ్యం అంతగా తెలియదు కదా , ఆ గైడ్ ముత్తాతలు ఈ కోట లోనే నివసించేవారుట ,ప్రస్తుతం మటుకు మీనా వృత్తి వారి కోసం కేటాయించిన ఊరిలో ఉంటున్నాడుట. ఈ మీనా కారీ కళాకారులే బ్లాక్ ప్రింటింగ్ , పాల రాయి మీద విలువైన రాళ్ళు పొదిగే పనులూ ,ఇలాంటి అందమైన హస్త కళలూ చేస్తూ తమ జీవనం సాగిస్తున్నారుట , వాళ్ళందరికీ ఒక సహకార సంస్థ  ఏర్పాటు చేసి ఓ పెద్ద దుకాణాల సముదాయం కట్టారు , వెనక్కి వెళుతూ మమ్మలిని అక్కడ దింపేసి అతను వెళ్ళి పోయాడు ..
ఒక్కసారి చూడండి అంటూ మా చేత చాలా కొనిపించడం లో విజయం సాధించారు ,అక్కడ వ్యాపారస్తులు ,తమ మాట్కారితనంతో ,అయ్యో పాపం ,మరి వాళ్ళు బ్రతకాలి కదా అంటూ నేను వంత పాడుతూ ఉంటే ,గోళ్ళూ కొరుక్కుని ,బీ పి తెచ్చుకుని ,నన్ను బయటకి తోసాడు తను .
ఎవరి ధర్మం వాళ్ళు నెర వేర్చాలి అని రాసి పెట్టి ఉంది కదా మరి ..మన వివాహ వ్యవస్థ లోనే ,ఒకరు కొనడం ,మరొకరు కొనడంకి అడ్డు వేయడం ..

జల్ మందిర్ అని ఓ విశాలమైన సరస్సు మధ్యలో ఓ భవంతి ని దాటి వెళుతూ ,భోజనం కోసం ఓ హోటల్ ముందు ఆగి ,సాయంత్రం మూడు కల్లా మా హోటల్ చేరాం , ఆ కోట లో ఎక్కీ దిగీ మా ఇద్దరికీ కాళ్ళూ నొప్పులు అప్పుడు తెలిసి వచ్చాయి ..అబ్బ ..ఆ రాజులూ ,రాణులూ ,ఈ కోటలో ఎలా తిరిగే వాళ్ళు బాబూ ,అనుకుంటూ మా థ్రీ బెడ్ రూమ్‌ ఫ్లాట్ తలచుకుని అమ్మయ్య అనుకున్నాం ..

ఆ రోజుకి మా విహారం పూర్తి అయినట్టే అని మా చోదకుడిని పంపించేసి ,సాయంత్రం అలా నడుచుకుంటూ ఆ రోడ్ ల మీద కాస్త తిరిగి ,ఓ సాండ్ విచ్ తో డిన్నెర్ అయింది అనిపించి ,అలసి పోయి ,హాయిగా నిద్ర పోయాం ..

రాజులైనా తినేవి అన్నమో ,చపాతీలో ,సాన్విచ్ లో కానీ బంగారాలూ ,ముత్యాలూ కాదు కదా ,రాత్రి అయేసరికి విశ్రమించేది మెత్తని ఓ పరుపు మీదే కానీ ,పాల రాయి బల్ల మీద కాదు కదా !! అన్న ఆఖరి ఆలోచనలతో నిద్ర హాయిగా కమ్మేసింది ..

పాల రాయి కింద విశ్రమించేది మటుకు ..జీవం పోయాకే .. ( కొసరు ఆలోచన ) 

జైపూర్ లో మా రెండో రోజు అయిపోయింది ..మరొక రోజు మరిన్ని విశేషాలు తో మళ్ళీ వస్తాను 


మా రాజస్థాన్‌ యాత్ర ..రెండో భాగం .

రాజస్థాన్‌ విహార యాత్ర .
రెండవ భాగం ..జై పూర్ ..లో మొదటి రోజు .
సరే ,ఆకలి ,విశ్రాంతి అయాయి కదా ,సాయంత్రానికి ఫ్రెష్ గా తయారు అయి సరిగ్గా ఆరు గంటలకి మా హోటల్ ముందుకి వచ్చాం , మా రధ చోదకుడు ( ఈటియోస్ కార్ ) కూడా రెడి గా ఉన్నాడు .
అలా నెమ్మదిగా నడుపుతూ ,మాకు అన్ని భవనాలు ,కూడలలు గురించి వివరిస్తూ , తిన్నగా బిర్లా మందిర్ వద్దకు తీసుకు వెళ్ళి , మమ్మలిని వెళ్ళి రమ్మాన్నాడు . సరే చెప్పులూ అవీ విప్పి ,మందిర్ లోపలకి వెళ్ళాం , సుందరమైన కృష్ణ - రాధ ల విగ్రహాలు పెద్ద వి గా నిలుచుని చిద్విలాసంగా నవ్వుతూ చూడ చక్కగా ఉన్నాయి ,విగ్రహాలు , ఫోటోలు తీయకూడదు అన్నారు ,కదా అని మేమూ తీయలేదు .
నాలుగు వేపులా కొన్ని సన్నివేశాలు కూడా చెక్కారు ..భాగవతం లోంచి . 
కొండ పైన కదా ,కొంచం చలి గా అనిపించింది .
కిందకి వచ్చాక ఒక కూడలి కి తీసుకు వెళ్ళాడు , వెనక సవాయ్ మాన్‌ సింఘ్ క్రికెట్ స్టేడియం ఉంది ట . ముందు వారి రాష్ట్రానికి చెందిన ఆర్మీ వాళ్ళ పేర్లూ , యుద్ధ సీన్లూ , కొన్ని స్పీచెస్ , అలా మొత్తం మీద మనకి ఆర్మీ అంటే ఎలాంటి త్యాగాలు చేస్తారో ,తెలిపేవిగా ఉన్నాయి చిన్న పిల్లలకి ముఖ్యంగా ఇవి చాలా స్ఫూర్తిదాయకం గా ఉంటాయి అనిపించింది .
పంచ రంగులలో మధ్యలో ఒక స్మృతి స్తంభం ఉంది , మన దక్షిణ దేశం కన్నా ఉత్తర దేశం లో వారు యుద్ధాలు అవీ చూసారు .. అని అనుకున్నాం ..అందుకే ఈ స్మృతి స్తంభాలూ అవి నిర్మించారు .
రాత్రి ఎనిమిది దాటింది , మా భోజనం సమయం అయిపోయింది ,ఠంచను గా మాకు సమయాలు చెప్పేస్తూ ఉంటాయి ..మా శరీరాలు ..అంతే ..
విరాసట్ అని ఒక మూడంతస్థుల భవనం హోటల్ కి తీసుకు వెళ్ళాడు , కింద అంతస్థులో మనం నేల మీద ఆని ఉండే చిన్న పీటల మీద కూర్చుంటే వారి సంప్రదాయ పద్ధతి లో నృత్యాలూ అవీ చేస్తూ పెడతారు అని చెప్పారు ..భోజనం .
మాకు అంత భారీ నాటకం వద్దు అనుకుని ,మరో అంతస్తు లో సంప్రదాయ రాజస్థానీ థాళీ భోజనం తీసుకున్నాం ...ఆ గట్టి పకోడీ లాంటి పదార్ధాలు మరీ అంత రుచించలేదు ,మిస్సీ రోటీ ,మరి కొన్ని రోటీలు విరివిగా ఇచ్చి ,ఒక చిన్న కటోరి గిన్నెలో తెల్లని రైస్ పెట్టాడు ..అమ్మయ్య ..మన అన్నం ఉంది కదా అని మొహం విప్పారి ,మొత్తానికి ఖాళీ చేసాం .
అడుగడుక్కి మెరిసిపోయే చిత్రాలూ ,అద్ద్దాలూ , మనం కొనాలని కళ్ళకి అడ్డం పడిపోతూ పెట్టారు కానీ ,ప్రేమగా చేయి పట్టుకుని కిందకి నడిపించేసాడు ,తను ..నా సంగతి తెలిసి .
ఈ రోజుకి మా విహారాలు పూర్తి అయాయి ..ఇంక మా హోటల్ కి వెళ్ళి నిద్ర పోడమే .. మేం మా వయసు కి తగ్గట్టు ,నెమ్మదిగా ,తొందర పడకుండా చూడాలి అని నిశ్చయించుకున్నాం ..అందుకే మరి రాత్రి జైపూర్ అంటూ ఉత్సాహపడలేదు ..
మరో రోజు ..మరి రేపే ..

మా రాజస్థాన్‌ యాత్ర ..

మా రాజస్థాన్‌ యాత్ర గురించి రాయమని అందరూ అడుగుతున్నారు కదా ,సరే ..మరి మొదలు పెట్టనా ..(వద్దు అన్నా ఊరుకుంటారా :) అంటారా !! )
పెళ్ళిళ్ళూ అవీ ఉన్నాయని చెప్పి , నిజంగానే ఉన్నాయి లెండి ,నేను ఓ మూడు వారాల ముందే వైజాగ్ వచ్చేసాను . నా ఫ్రెండ్స్ అందరూ ,వచ్చావా !! అంటూ పెద్ద లిస్ట్ చెప్పారు ..చూడాల్సిన సిన్మాలూ , రుచి చూడవల్సిన కొత్త హోటళ్ళ భోజనాలూ , సరి కొత్త ఐసు క్రీం పార్లర్లూ అంటే మొత్తంగా సెలవు దినాలని బాగా ఎంజాయ్ చేసేయాలని పెద్ద పెద్ద ప్లాంస్ వేసేసుకున్నాం .
ఆ విషయాలు అన్నీ రాసాను కదా , మొత్తం బీరువాలో దాచి పెట్టిన పట్టు చీరలకి పని పడింది .
ఈ లోపల కుమార్ రాజస్థాన్‌ టూర్ ప్రోగ్రాం , అంటూ ఒక మైల్ పంపించాడు ,అయితే నాకున్న సవాలక్ష వ్యాపకాలలో అది విప్పి చూడ్డమే పడలేదు. అయితే తనకే అప్ప చెపితే ఇంక నేను వేరే ఏం చూసుకో అక్కరలేదు కదా ..తేడా వస్తే నాదేం లేదు బాబూ అని అనేయ వచ్చు ..:))
ఇంక వంటింట్లో వీరగా వంటలు వండుతూ ,మధ్యలో టూర్ అని చెప్పి విచ్చలివిడిగా షాపింగ్ చేసేస్తూ ,తగు మాత్రం గా వంటా ,డబ్బూ తగలబెట్టాను ..
చూస్తూ ఉండగానే 2017 వచ్చేసింది ..ఆఘమేఘాల మీద ..సరిగ్గా వీడ్కోలూ అవీ ఇవ్వనే లేదు ,2016 కి అనుకుంటూ ఉండగా అప్పుడే రెండో తారీఖు కూడా వచ్చేసింది .
ఏమిటో రాజస్థాన్‌ అని తప్ప మరే వివరమూ తెలియదు నాకు , తను షిప్ లో ఉద్యోగం చేస్తున్నప్పుడు , ఇలా వెళ్ళాలి అనగానే మొత్తం అంతా ప్లాన్‌ వేసి ఉంచేదాన్ని , ఇప్పుడు పిల్లలో ,తనో చూసుకుంటున్నారు ..అదో తృప్తి ..
ముందు రాజధాని డిల్లి కి అయిర్ ఇండియా వాళ్ళ ఫ్లైట్ , వాళ్ళిచ్చిన సాండ్ విచెస్ మహా ప్రసాదం అని తినేసాం ..నాకూ ,మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా తిండి విషయమ్లో నకరాలు ఏమీ లేవు , అవి తినం ,ఇవి తినం అన్నదే లేదు ..శాకాహారం అయితే చాలు ..
ఢిల్లి లో ఎక్కువ సమయం లేదు ,మరో ఫ్లైట్ ఎక్కి జైపూర్ చేరాం , ఒంటి గంట కల్లా .
రాజస్థాన్‌ రాష్ట్రం కి రాజధాని అయినా ,మన షంషాబాద్ అంత పెద్దది కాదు ,కానీ బాగుంది వాళ్ళ విమానాశ్రయం .
ఈ లోపలే మాకు ఫోన్‌ వచ్చింది , మాకు ఆ టూర్ వాళ్ళు మాట్లాడి పెట్టీన టాక్సి డ్రైవరు దగ్గర నుంచి . అతని పేరు గజేంద్రన్‌
సరే, బయటకి రాగానే ఎక్కువ ఆలస్యం చేయకుండా కారు వచ్చింది , ఎక్కి కూర్చున్నాం. అదే కారు మాకు టూర్ అంతా అని అప్పుడే నాకు తెలిసింది , మళ్ళీ మమ్మలిని ఉదయపూర్ అయిర్ పోర్ట్ లో దింపేవరకూ అతనే మా వాహన చోదకుడు , పెద్ద వయసులో మర్యాదగా ,బాగానే ఉన్నాడు , హిందీ యా ,ఆంగ్లమా అని మాట వరసకి ఓ ప్రశ్న అడిగేసి ,చిక్కని రాజస్థానీ యాస లో హిందీ మాట్లాడడం మొదలు పెట్టాడు , మేం ఇంక చెవులు నిక్క పెట్టి ,ఒక్కో మాట జాగ్రత్తగా వినడం మొదలుపెట్టాం ..సోనీ టీ వీ కూడా చూడం మేం , మా హిందీ అంతంత మాత్రం మరి .
విమానాశ్రయం నుంచి బయటకి వెళ్ళి పోతూ , పార్కింగ్ అంటూ ఓ వంద మా చేత ఇప్పించాడు .. మామూలుగా అయితే నేనే ఇవ్వాలి అంటూ ఓ కొసరు మాట చేర్చి , వంద యే కదా అనుకునే వాళ్ళం మేం , ఈ విధంగా అతను మా వాలకం ఏమిటో పరీక్ష చేసి , ఫరవాలేదు , అంత ఖతరా మనుషులు కాదు ,మంచి వాళ్ళే ,( అంటే !!!! చాలా అర్ధాలు ఉంటాయి మరి ) అని నిర్ధారించుకుని , జై జై అంటూ రధం కదిలించాడు .
తిన్నగా ఒకటే రోడ్డు , అటూ ,ఇటూ పచ్చని చెట్లూ ,మధ్యే మధ్యే మేమూ ఉన్నాం అంటూ తొంగి చూస్తున్న రంగు రంగుల పూల పొదలూ , ప్రభుత్వ ఆసుపత్రీ , పెద్ద హోటల్స్ , ఇలా అన్నీ ముఖ్య ప్రదేసాలనీ పరిచయం చేస్తూ కుడి వేపు చూడండి అంటే నేను ముందు మరో వేపు చూడడం ,అసలే నాకు కుడీ ఎడమా లో కొంచం అయోమయం ,అది మరి హిందీ లో అంటే నేను చూసే సరికి అది దాటి పోవడం అయ్య్యాక ,రధం ని మెల్లగా నడిపిస్తూ చూపించేడు , కుడి వేపు ఎత్తైన కొండ మీద ఓ మహల్ అందులో మహా రాణీ గాయత్రి దేవి ఉండే వారు అనీ , అలా చెప్పగానే ఆవిడ అందం ,ఆ కథలూ అన్నీ గుర్తు వచ్చి ,రాజుల సంపద అంతా రాళ్ళ పాలు అని ఏదో విన్నాను ,అబ్బ ,ఈ కొండ పైకి ఎలా ఎక్కేవారు ? అనుకోగానే ,ఏనుగుల మీద ఎక్కేవారు అని చెప్పేసాడు , ఫరవాలేదు , నా ఆలోచనల లింక్ బాగానే అందుకుంటున్నాడు అనుకుని సంతోషించాను .
ఆ కొండ మీదే బిర్లాలు కట్టిన కృష్ణ మాందిరం అదే గుడి ఉంది ,అని చూపించాడు ..
ఇలా నెమ్మదిగా అన్నీ చూపిస్తూ ,ఒక కూడలి లో తిరగ గానే మా హోటల్ వచ్చింది అని లోపలికి తిప్పాడు , ఒక సింహ ద్వారం లాంటి పెద్ద ఆర్చి లోంచి ముందుకు వెళ్ళగానే " నారాయణ నివాస్ " అనే పేరు కనిపించింది .
అది ఓ చిన్న పాలస్ ..అంటే ఒకప్పుడు ..మా పేర్లు చెప్పి , ఐ డి లు ఇచ్చి , లోపలకి తీసుకు వెళ్ళమని చెప్పేసరికే ఆకలి మొదలయింది ..
చక్కని తలపాగాలు చుట్టుకుని ,పంచలు కట్టుకున్న పని వాళ్ళు నెత్తి మీద పెట్టెలు పట్టుకుని ఓ పక్కన ఉన్న చిన్న కూపం లాంటి ఒంటి స్తంభం మేడ పైకి దారి తీసారు ..
కుర్రాడి లాగా కుమార్ చకచక ఎక్కేస్తూ ఉంటే ,ఓ నాలుగు మెట్లు పోటీగా ఎక్కి ,ఆ పై నుంచి ఆయాస పడడం మొదలు పెట్టాను ,అలా ఓ నాలుగు మడతలు ఎక్కాక ఓ గుమ్మం కనిపించి ,అమ్మయ్య అని అటు తొంగి చూస్తే , అది మొదటి అంతస్తు అమ్మా అని చిలిపి నవ్వులతో గుసగుసగా చెప్పారు , అకలికి అప్పటికే నాకు కళ్ళు బైర్లు కమ్మాయి , సరే ఎలాగో మొత్తానికి నా శరీరాన్ని గ్రావిటి కి ఎదురొడ్డి లాక్కుని చేర వేసాను , అక్కడ ఉంది ట మా రూం ..చుట్టూ డాబా , చిన్న టవర్లూ , రూం లో పెద్ద పెద్ద మీసాలతో రాజుల ఫుటోలూ , బాబోయ్ ,అని వల్ల కాదు అని గోల పెట్టాను ..
సరే లెమ్మని , మరో నేల మీద రూమ్‌ ,ఈత కొలను దగ్గరగా ఇచ్చారు , అటూ ,ఇటూ తిప్పుతూ మొత్తానికి రూం కి చేర్చారు .
సామాన్లు అలా కూలేసి ,శుభ్రమైన భోహనం కి బయలు దేరాం ,అల్ల మల్లీశ్వరి సిన్మా లోలాగే మలుపులూ ,మెట్లూ ఎక్కీ ,దిగాక వచ్చింది ..అమ్మయ్య అని కూలబడి ,ఏది ఉంటే అది పెట్టు మహప్రభో అని కూడ బలుక్కుని శరణు వేడాం ..
మా గజేందృడు ,భోజనాలు చేసి కాస్త విశ్రమించండి ,సాయంత్రం ఆరు కి వస్తాను అని సీను నుంచి నిష్కమించాడు .
ఇలా చేయండి ,అలా తినండి అంటూ మాకు ఇలా చాలా చెప్తూ ఉంటాడు అని అప్పటికి మాకు తెలియదు కదా ..
హాయిగా నడుమ వాల్చాం .
మరో పార్ట్ రాస్తాను ..కూసింత విరామం తీసుకుని